Shraddha Walker Case: ఆఫ్తాబ్ చెఫ్..కత్తులు వాడటంలో మంచి నైపుణ్యం

దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని.. కత్తులను వినియోగించడంలో అతడికి నైపుణ్యం ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతోపాటు మాంసాన్ని వాడటం, భద్రపరచే తీరుపై పూర్తి అవగాహన ఉందన్నారు. అంతేకాకుండా గతంలో శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పినట్లుగానే ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడని కేసు విచారణ సందర్భంగా కోర్టులో ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఆఫ్తాబ్ కేసుకు సంబంధించి ఢిల్లీని సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్ గతంలో మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ప్రస్తావించిన ఎస్పీపీ.. అప్పుడు భయపెట్టినట్లుగానే ఆఫ్తాబ్ నేరానికి పాల్పడినట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు.
భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారిద్దరూ కలిసే ఉన్నారని కోర్టుకు చెప్పారు. ముంబయిలో మూడుచోట్ల ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. కలిసి పనిచేసేవారని అయితే, ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారన్నారు. అందులో భాగంగా పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారని చివరకు శ్రద్ధాను చంపేందుకు నిర్ణయించుకున్న ఆఫ్తాబ్ అందుకోసం కత్తులు కొన్నట్లు ఆరోపించారు. ఆమెను చంపి ముక్కలుగా చేశాడని కొత్త ఫ్రిజ్ కొని కొంతకాలం వాటిలో భద్రపరిచాడన్నారు. అనంతరం వాటిని వివిధ ప్రదేశాల్లో విసిరేశాడని తెలిపారు. ఇక సుమారు ఆరు నెలల తర్వాత కేసు బయటపడిందని సేకరించిన ఎముకలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా అవి శ్రద్ధా తండ్రితో సరిపోలాయన్నారు. శద్ధాను చంపిన తర్వాత మరో అమ్మాయితో స్నేహం మొదలుపెట్టాడని ఆమెకు ఓ ఉంగరం కానుకగా ఇచ్చాడని కోర్టుకు వెల్లడించారు. అది గతంలో శ్రద్ధాకు ఇచ్చిందేనని ఆఫ్తాబ్ నేరం చేశాడనడానికి ఇవన్నీ సాక్షాలేని న్యాయస్థానానికి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com