Kerala: ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం.. రెస్టారెంట్ క్లోజ్

Kerala: ఇంట్లో వంట నచ్చకపోతే ఆర్డర్ పెట్టేస్తున్నారు.. నిమిషాల్లో వేడి వేడిగా పార్శిల్ వచ్చేస్తుంది.. ఎలా చేశారో., ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి టైమే లేదు. ఆలోచిస్తే ఏమీ తినలేం అని నోర్మూసుకుని తినడం అవుతోంది.. కొన్ని దారుణ సంఘటనలు వింటే ఆన్ లైన్ ఫుడ్ అంటే భయమేస్తుంది.
కేరళ రెస్టారెంట్లోని ఆహారంలో పాము చర్మం కనిపించడంతో అధికారులు ఆ రెస్టారెంట్ ను మూసివేశారు. తిరువనంతపురంలోని ఓ కస్టమర్ తన ఫుడ్ డెలివరీ పార్శిల్లో పాము చర్మాన్ని గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒక మహిళ, ఆమె కుమార్తె తమ ఫుడ్ డెలివరీ పార్శిల్లో పాము చర్మం చూసి షాక్కు గురయ్యారు. దానిని చూడగానే వారికి వాంతి వచ్చినట్లయింది. వెంటనే వాళ్లు రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ముందు రెస్టారెంట్ ను తనిఖీ చేసి ఆపై మూసివేయమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు.
తిరువనంతపురం నివాసి ప్రియ గత గురువారం నగరంలోని నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుండి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. ఆహారం డెలివరీ అయిన తర్వాత, ఆమె తన కుమార్తెకు మొదట వడ్డించింది. ప్రియ తినడం ప్రారంభించినప్పుడు పాము చర్మాన్ని గుర్తించింది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆమె పెద్దగా కేకలు వేసింది.
ఈ ఘటనపై ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫుడ్ సేఫ్టీ అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆమె ఫిర్యాదు మేరకు స్థానిక మునిసిపల్ అధికారులు రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టారు రెస్టారెంట్ లోని కిచెన్ వాతావరణం అంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని యాజమాన్యాన్ని మందలించి వెంటనే దాన్ని మూసివేశారు.
ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే వార్తాపత్రికలో పాము చర్మం ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని నెడుమంగడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అర్షిత బషీర్ తెలిపారు. హోటల్ కార్యకలాపాల గురించి బషీర్ మాట్లాడుతూ, వంటగదిలో తగినంత వెలుతురు లేదని, ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపించిందని చెప్పారు. రెస్టారెంట్ లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు యజమానులకు షోకాజ్ నోటీసు కూడా అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com