Sonia Gandhi: ఈరోజు కూడా సోనియాను విచారించనున్న ఈడీ..
Sonia Gandhi: సోనియాగాంధీ ఇవాళ కూడా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందుకు వెళ్లిన సోనియా.. మూడోసారి వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు వెళ్తున్నారు. సోనియా గాంధీని మొదటి రోజు 2 గంటలు, రెండో రోజు 6 గంటలు ప్రశ్నించారు. ఇప్పటి వరకు సోనియాను 55 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.
దాదాపుగా రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే సోనియాను అడిగారని తెలుస్తోంది. నిన్న ఉదయం 11 గంటలకు వెళ్లిన సోనియాను.. సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్కు యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కేవలం 50 లక్షలు మాత్రమే చెల్లించి, అసోసియేట్ జర్నల్కు కాంగ్రెస్ ఇచ్చిన 90 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. యంగ్ ఇండియాలో రాహుల్, సోనియాకు చెరో 38 శాతం వాటా ఉండడంతో.. దాదాపు ఒకేరకమైన ప్రశ్నలు అటు రాహుల్, ఇటు సోనియాకు సంధించినట్లు తెలుస్తోంది.
సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఇవాళ కూడా ఆందోళనలకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. నిన్న సోనియాగాంధీ విచారణ ముగిసే వరకు రాహుల్ గాంధీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. సోనియా విచారణ ముగిసిన తరువాత రాహుల్తో సహా వివిధ పోలీస్ స్టేషన్ల నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని భావించారు. ఇందుకోసం పార్లమెంట్ నుంచి ర్యాలీగా బయల్దేరిన రాహుల్, కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ఘాట్ వద్ద సత్యాగ్రహ దీక్షకు పోలీసులు అనుమతించకపోవడంతో రాహుల్ సహా కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్ వద్ద రోడ్డుపైనే కూర్చున్నారు. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com