ఆలయ భూములకు దేవుడే యజమాని : సుప్రీంకోర్టు

ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పూజారులు కేవలం దేవుడి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూసే సంరక్షకులు మాత్రమేనని పేర్కొంది. దేవుడి భూములపై పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన వారు భూస్వాములు కాలేరని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆలయాల ఆస్తులను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య చర్యలు చేపట్టింది. ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించాలంటూ రెండు సర్క్యులర్లు జారీ చేసింది. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ఈ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. ఆలయ భూములకు దేవుడే యజమాని అని స్పష్టం చేసింది. ''ఆలయ భూములకు సంబంధించిన రికార్డుల్లో ఓనర్షిప్ కాలమ్ వద్ద కేవలం దేవుడి పేరు మాత్రమే ఉండాలి. అనుభవదారు అనే కాలమ్లోనూ దేవుడే పేరే ఉండాలి. ఎందుకంటే ఆ భూములకు దేవుడే యజమాని. పూజారి కేవలం దేవుడి ఆస్తులను నిర్వహిస్తాడు. అందువల్ల పూజారుల పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదు. చట్టప్రకారం.. పూజారి అంటే వ్యవసాయంలో కౌలుదారుడు కాదు. దేవుడికి పూజలు చేసే వ్యక్తి. అయితే దేవస్థానం తరఫున ఆ భూమిని కలిగి ఉంటాడు. దేవుడి ఆస్తులను పరిరక్షిస్తుంటాడు. అంతమాత్రాన అతడు భూస్వామి కాలేడు'' అని కోర్టు తీర్పు వెలువరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com