తెలంగాణకు తమిళనాడు రూ.10 కోట్లు విరాళం
గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్య నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికి పోయింది. ఎక్కడ చూసినా కొట్టుకుపోయిన రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలు నగరం చెత్తమయంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్ధం తమిళనాడు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం పళని స్వామి స్పష్టం చేశారు.
తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. అయితే కేంద్రం నుంచి ఏ విధమైనా స్పందనా రాలేదు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే సహాయక చర్యలు చేపడతామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీల్లోని ప్రజలను కచ్చితంగా ఆదుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మరణించారు. ఇప్పటి వరకు 29 మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com