దొరికిపోయాన్రో దేవుడో.. లంచం రూ.20 లక్షలను తగలబెట్టిన తహసీల్దార్

పట్టుబడినప్పుడు చూసుకుందాంలే అని టేబుల్ కింద చేయి పెట్టాడు.. అందినకాడికి దోచుకున్నాడు. అక్రమంగా ధనం ఆర్జిస్తున్న తహసీల్దార్గా రికార్డులకెక్కాడు రాజస్థాన్ సిరోహి జిల్లాకు చెందిన కల్పేష్ కుమార్ జైన్. కానీ తన ఆటలు ఎంతో కాలం సాగ లేదు. ఎసిబి అధికారులకు తెలిసింది.
ముందస్తు నోటీసులు ఇచ్చి రైడ్ చేయడానికి వచ్చారు. లంచం తీసుకునేటప్పుడు లేని భయం అధికారులు వస్తున్నారని తెలిసే సరికి వెన్నులో వణుకు మొదలైంది. ఎలాగూ కష్టపడితే వచ్చిన సొమ్ము కాదు కదా అని కాల్చి పారేశాడు. బుధవారం రాత్రి తన దగ్గర ఉన్న విలువైన కరెన్సీ నోట్లు 20 లక్షల రూపాయల మీద అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. ఎసిబి అధికారులు దాడి చేస్తున్నారని తెలిసి ఇంటి లోపల తాళం వేసి కరెన్సీ నోట్లను తగలబెట్టాడు.
ఎసిబి అధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అక్కడ తహశీల్దార్ తన వంటగదిలో కరెన్సీ నోట్లను తగలబెడుతున్న దృశ్యం కనిపిస్తుంది. వీడియోలో, ఎసిబి అధికారులు తహసీల్దారును తలుపులు తీయమని అడుగుతున్నారు. ఎంతకీ తెరవకపోవడంతో అధికారులు కిచెన్ కిటికీని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లల ఏడుపు కూడా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com