Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష పడాలి: విస్మయ తండ్రి

Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి  యావజ్జీవ శిక్ష పడాలి: విస్మయ తండ్రి
Vismaya-Case: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఆయుర్వేద వైద్య విద్యను చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు..

Vismaya-Case: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఆయుర్వేద వైద్య విద్యను చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు..పెళ్లై ఏడాది కూడా గడవకముందే కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు అల్లుడు.. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది కేరళకు చెందిన విస్మయ.

ఈ కేసులో కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు విస్మయ భర్త కిరణ్ కుమార్ కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.12.5 లక్షలు జరిమానా కూడా విధించింది. ఈమొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. వరకట్న వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కోర్టు విశ్వసించి కిరణ్ కుమార్ ను సోమవారం దోషిగా నిర్ధారించింది.

అతడిపై వచ్చిన నేరారోపణలు రుజువు కావడంతో అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహన్ రాజ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే కిరణ్ కుమార్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి అతడిని తొలగించారు.

పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ. ఘటనకు ఒక రోజు ముందు విస్మయ తన బంధువులకు పంపిన వాట్సాప్ సందేశాలను పంపింది. అలాగే ఆమె తన శరీరంపై ఉన్న గాయాల ఫోటోలను, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపింది.

2020లో పెళ్లి సందర్భంగా కుమార్ కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్ కి కట్నంగా ఇచ్చారు. కారు నచ్చలేదని, దాని బదులు 10 లక్షల నగదు కావాలని వేధించేవాడని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు.

వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

కిరణ్ కుమార్ కు పదేళ్ల జైలు శిక్షపడినందుకు సంతోషంగానే ఉన్నా తమ బిడ్డ ఆత్మ శాంతించాలంటే అతడికి యావజ్జీవ శిక్ష పడాలని విస్మయ తల్లిదండ్రులు కోరుకున్నారు. ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే తండ్రి విచారణకు హాజరయ్యారు.

నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం కారులోని సీటును ఎప్పుడూ ఖాళీగా ఉంచుతా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు ఇచ్చిన తాజాతీర్పును పై కోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లె వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story