తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం..!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం..!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరుణానిధి ఉన్నంతకాలం తండ్రి వెనక ఉండి పార్టీని నడిపించిన స్టాలిన్‌.. ఇప్పుడు తానే రథసారథి అయ్యారు

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరుణానిధి ఉన్నంతకాలం తండ్రి వెనక ఉండి పార్టీని నడిపించిన స్టాలిన్‌.. ఇప్పుడు తానే రథసారథి అయ్యారు. విలక్షణ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో పార్టీని నడిపించి.. అధికారంలోకి తీసుకొచ్చారు. నిజానికి ఏనాడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. కాని, కుటుంబ తగాదాలు, భాగస్వామ్య పార్టీలు స్టాలిన్‌ను సీఎంగా చేయడానికి నిరాకరించాయి. కరుణానిధి ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండాలని పట్టుబట్టాయి. పైగా అళగిరి సైతం స్టాలిన్‌ను సీఎం కాకుండా అడ్డుకుంటానంటూ సవాల్‌ చేశారు. అందుకే, అవకాశం వచ్చినా సరే.. సీఎం కాలేకపోయారు స్టాలిన్. 65 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు.

టీనేజ్‌ నుంచే పార్టీ కోసం కష్టపడి పనిచేశారు స్టాలిన్. 14 ఏళ్ల వయసుకే యూత్‌ లీడర్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు. ప్రతి సందర్భంలోనూ తండ్రికి తోడుగా నిలిచి పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి.. పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయడంలో ఫోకస్ పెట్టారు. కరుణానిధి తదనంతరం తన స్టైల్‌ మార్చారు. అలాగని దూకుడుగా, అధికార పార్టీపై లేనిపోని విమర్శలేం చేయలేదు. తానేం చేయగలనో అనేది మాత్రమే చెప్పుకొచ్చారు. కాకపోతే, బీజేపీని టార్గెట్‌ చేయడం ద్వారా అన్నాడీఎంకేను దెబ్బతీశారు. పళనిస్వామి ప్రభుత్వం ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడ్డం తప్ప ఏమీ చేయలేదనే నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తోందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఈ ఒక్క నినాదమే డీఎంకే గెలుపునకు కారణమైంది.

స్టాలిన్‌కు గెలుపు అంత సులభంగా ఏం దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే ఊడ్చిపారేస్తుందని చెప్పుకొచ్చాయి. కాని, డీఎంకే కూటమి 157 స్థానాలకే పరిమితం అయింది. దాదాపు 200 స్థానాల వరకు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. అలా జరగలేదు. దీనికి కారణం పళనిస్వామి పనితనం. జయలలిత మరణం తరువాత సీఎం కుర్చీలో కూర్చున్న పళని స్వామి.. అంతే ఓర్పు, నేర్పుతో ప్రభుత్వాన్ని నడిపించారు. అసమ్మతిలాంటివి లేకుండా చూసుకున్నారు. ప్రభుత్వంపై కూడా ఎటువంటి వ్యతిరేకత రానీయకుండా చూసుకున్నారు. అటు డీఎంకే కూడా ప్రభుత్వంపై అంతే సాఫ్ట్‌గా వెళ్లింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా డీఎంకేలోకి చేరతారనుకున్నారు. కాని, స్టాలిన్ మాత్రం.. వాళ్లెవరినీ చేర్చుకోలేదు. ప్రజలు ఇచ్చే తీర్పుకే కట్టుబడి ఉందాం అంటూ అదే స్ఫూర్తితో నిలబడ్డారు.

నిజానికి తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత రాలేదు. జయలేని లోటు కనిపించకుండా చేయడంలోనూ పళని సక్సెస్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం సైతం అధికార పార్టీని పెద్దగా టార్గెట్ చేయలేదు. కరోనా విజృంభిస్తున్నా.. దాన్ని రాజకీయ కోణంలో వాడుకోలేదు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో కనిపించడం నిజంగా కొత్త, వింతే. కాని, అన్నాడీఎంకే బీజేపీతో పొత్తుపెట్టుకోవడమే కొంప ముంచిందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీతో కలిసి వెళ్లకపోయి ఉంటే.. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య టఫ్‌ ఫైట్ ఉండేదని విశ్లేషిస్తున్నారు. జయ, కరుణానిధి మధ్య అధికార మార్పిడి జరిగే తమిళనాడులో ఇక నుంచి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story