కరోనాతో మృతి చెందిన టాలీవుడ్ నటుడు ..

వెండితెరపై నవ్వులు పూయించిన ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. గత 23 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చినా కోలుకోలేకపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. కోసూరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ఫుడ్ కార్పొరేషన్లో మేనేజర్గా పని చేసి రిటైరయ్యారు. నటన మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన దాదాపు 27 సంవత్సరాలు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
కోసూరి మొదటి చిత్రం 'తెగింపు'. అయితే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాదరామన్న చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఛలో చిత్రంలో వెన్నెల కిషోర్ తండ్రి పాత్ర పోషించిన కోసూరి ఆద్యంతం నవ్వులు పూయించారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ ఆయన చివరి సారిగా కనిపించారు. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com