ట్విట్టర్‌కు షాక్ ఇవ్వనున్న కేంద్రం?

ట్విట్టర్‌కు షాక్ ఇవ్వనున్న కేంద్రం?

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను అలా కాకుండా జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఎందుకలా చూపించారో వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్‌కు ఐదు రోజుల గడువు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ స్పందించకున్నా, అది ఇచ్చే వివరణ 'సంతృప్తికరంగా' లేకున్నా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద భారత్‌లో ట్విట్టర్ యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు. ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు నమోదు చేయవచ్చు. లేహ్‌ను ఉద్దేశపూర్వకంగానే జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించినట్టు జాక్ డోర్సీకి చెందిన ట్విట్టర్‌కు ప్రభుత్వం పంపిన నోటీసులో పేర్కొంది. భారత సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు చేసిన ప్రయత్నంలో ఇది భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. లేహ్‌ను భారత ప్రభుత్వం కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ప్రకటించిందని, దాని రాజధాని లేహ్ అని తెలిపింది.

తప్పుడు పటాన్ని చూపించి భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు వెబ్‌సైట్, దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. కాగా, ట్విట్టర్ ఇటీవల లేహ్‌ను చైనాలో భాగంగా చూపించి భారత ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. ట్విట్టర్ తీరును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం దాని అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో మార్పులు చేసినప్పటికీ, లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌లో భాగంగానే వదిలేసింది. దీంతో ఈసారి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. సంతృప్తికర వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story