Rahul Gandhi : దేశం ఇప్పుడు రెండు ఇండియాలుగా మారింది : రాహుల్ గాంధీ

Rahul Gandhi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగంలో దేశాభివృద్ధిపై వ్యూహాత్మక దృష్టి లోపించిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించలేదని మండిపడ్డారు. కేవలం పలువురు బ్యూరోక్రాట్లు ఇచ్చే సలహాల జాబితాలాగా ఉందంటూ ఎద్దెవా చేశారు.
రెండు ఇండియాల అంశంపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు రాహుల్. తన దృష్టిలో ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయన్న రాహుల్...ఒకటి పేదల ఇండియా, మరోటి ధనవంతుల ఇండియా ఉందంటూ విమర్శించారు. ఈ రెండు ఇండియాల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదన్నారు. దేశ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందన్నారు. 2021లో దేశంలో 3 కోట్ల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు రాహుల్. UPA పదేళ్ల పాలనలో పది కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్న రాహుల్...ప్రస్తుతం బీజేపీ పాలనలో 23 కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి జారుకున్నారని చెప్పారు.
సరిహద్దుల్లో మిత్రదేశాలు లేక భారత్ ఏకాకి అయిందన్నారు రాహుల్. గణతంత్ర దినోత్సవానికి విదేశాల నుంచి అతిథులు రాని పరిస్థితిపై కేంద్రం తనను తానూ ప్రశ్నించుకోవాలన్నారు. చైనీయులకు తాము చేయాలనుకున్న అంశాలపై పూర్తి స్పష్టత ఉందన్నారు రాహుల్. భారతదేశ విదేశాంగ విధానం అతిపెద్ద లక్ష్యం చైనా, పాకిస్థాన్లను వేరుగా ఉంచడమేనన్న రాహుల్...కేంద్రం ఆ రెండు దేశాలను ఒక్క చోటుకు చేర్చి తప్పిదం చేసిందన్నారు. రాష్ట్రాల సమైక్యతను నాశనం చేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ లాంటివి సాధనాలుగా మారాయని ఆరోపించారు రాహుల్. ఐతే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com