Uttar Pradesh: సమాజ్వాదీ పార్టీకి ఝలక్.. బీజేపీలోకి మాజీ సీఎం కోడలు..

Uttar Pradesh: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని సమాజ్వాదీ పార్టీ ఝలక్ ఇవ్వగా.. ఇప్పుడు బీజేపీ.. సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బకొట్టింది. ఏకంగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ కోడలినే పార్టీలో చేర్చుకుని.. ఎస్పీకి షాక్ ఇచ్చింది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్.. సమాజ్వాదీ పార్టీకి రాంరాం చెప్పి.. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు మరింత హీటెక్కాయి.
అపర్ణ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఇటీవల స్టాండ్ మార్చిన అపర్ణ.. బీజేపీ విధానాలను సమర్థిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలోనూ కమల దళంకు అనుకూల పోస్ట్లు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం ఆమె బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఆ వార్తలను అటు అపర్ణయాదవ్ గానీ.. ములాయం కుటుంబ సభ్యులు గానీ ఖండించలేదు. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10న మొదటి ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అపర్ణయాదవ్.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. ఆ పార్టీకి నైతికంగా బలాన్నిచ్చింది. ములాయం కుటుంబ సభ్యులే మావైపు ఉన్నారని ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com