'నీట్' నిర్వహించడాన్ని తప్పుపట్టిన 'సూర్య'..
ఈనెల 13వ తేదీ ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు ఒక రోజు ముందు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఘటన తమిళనాట వివాదాస్పదమైంది. అగ్ర నటుడు సూర్య కరోనా మహమ్మారి నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. ఒక మహమ్మారి మధ్య విద్యార్థులను నీట్ రాయమని బలవంతం చేసినందుకు సూర్య సుప్రీంకోర్టును సైతం నిందించారు. సీనియర్ రిటైర్డ్ న్యాయమూర్తులు సూర్య వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. శనివారం పరీక్షకు ఒక రోజు ముందు ముగ్గురు విద్యార్థులు మరణించినట్లు నటుడు తన ప్రకటనలో తెలిపారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రాణానికి ముప్పు ఉన్న సమయంలో ఒక పరీక్ష రాయడం ద్వారా విద్యార్థులు తమ అర్హతను నిరూపించుకోవలసి రావడం బాధాకరమని సూర్య అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను కల్పించాల్సిన ప్రభుత్వం విద్యావ్యవస్థతో చట్టాన్ని తీసుకువచ్చి అసమానతలను సృష్టిస్తుంది అని సూర్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దేశంలో విద్యా విధానాలను నిందించిన ఆయన, పేదలు, అణగారిన వర్గాల గురించి ఆలోచించని వారు దీనిని రూపొందించారని అన్నారు.
న్యాయవ్యవస్థను ప్రస్తావిస్తూ.. ప్రాణాంతక కరోనావైరస్ కారణంగానే కోర్టులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయం చేస్తున్నాయి. కాని విద్యార్థులను మాత్రమే నిర్భయంగా వెళ్లి పరీక్షలు రాయమని ఆదేశించడం ఏం న్యాయం అని సూర్య ప్రశ్నిస్తున్నారు. అయితే సూర్య అభిప్రాయాన్ని తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్ ఖండించింది. సోమవారం సాయంత్రం నాటికి, ఆరుగురు ప్రముఖ న్యాయవాదులు నటుడికి మద్దతుగా చేతులు కలిపారు. నటుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని వారు కోరారు.
విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో మేం మౌనంగా ఉండం అని సోషల్ మీడియా వేదికగా సూర్య ఉద్యమానికి పిలుపునిచ్చారు.. ఆయనకు మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.. SURIYAagainstNEET అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అదే విధంగా మరో నటుడు మాధవన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ సైతం కోవిడ్ కాలంలో నీట్ పరీక్షను నిర్వహించి విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కేంద్రాన్ని నిందిస్తున్నారు.. ఈ విషయంపై ఉద్యమం చేపట్టిన సూర్యకు మద్ధతుగా నిలుస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com