కరోనాతో వెంటిలేటర్పై భర్త .. వీర్యం కోరిన భార్య..!
కరోనా కారణంగా ఓ వ్యక్తి అవయవాలు దెబ్బతిని వెంటిలేటర్పై ఉన్నాడు. అతను బ్రతికే అవకాశాలు ఇక తక్కువేనని వైద్యులు కూడా వెల్లడించారు. దీనితో తన భర్త వీర్యాన్ని తనకు ఇప్పించి సంతాన భాగ్యాన్ని కల్పించాలని అతని భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె కోరికకు భర్త తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. మంగళవారం మహిళ వేసిన పిటిషన్ను వెంటనే విచారించింది గుజరాత్ హైకోర్టు.
రోగి భార్య కోరినట్లు.. మరణానికి దగ్గరలో ఉన్న ఆమె భర్త యొక్క స్పెర్మ్ను సేకరించాలని వడోదర ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది. వీర్య సేకరణకు వ్యక్తి అనుమతి అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియకు అనుమతి తెలిపే స్థితిలో రోగి లేనందున అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ అశుతోశ్ జే శాస్త్రి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వెంటిలేటర్పై ఉన్న వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించారు వైద్యులు. కృతిమ పద్ధతిలో గర్భధారణ పొందేందుకు ఆమె తన భర్త వీర్యాన్ని కోరింది.
కాగా కోర్టు విచారణ తరువాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కృత్రిమ గర్భధారణకు కోర్టు అనుమతి మంజూరు చేయలేదు. మరోవైపు, గుజరాత్ హైకోర్టు ఈ కేసును గురువారం విచారించే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com