China Attack India : హిందూ మహాసముద్రంలో చైనా ఎత్తుగడ.. భారత్కు ముప్పు..
China Attack India : ఆధిపత్యమే లక్ష్యంగా డ్రాగన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశాల అభ్యంతరాలను ఏ మాత్రం లెక్కచేయకుండా దూసుకెళ్తోంది. హిందూ మహాసముద్రంలో పట్టు బిగించేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్...తాజాగా మరో ఎత్తుగడ వేసింది. చైనా తీరు భారత్కు పెనుగండం చుట్టుముట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఇప్పటికే శ్రీలంక హంబన్టోట పోర్టులో క్షిపణి ట్రాకింగ్ నిఘా నౌకను మోహరించిన డ్రాగన్.. తాజాగా ఆఫ్రికాలోని జిబౌటీ దేశంలో మరో సైనిక స్థావరాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2016లో చైనా 590 మిలియన్ డాలర్లు వెచ్చించి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరం నిర్మించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సూయజ్ కాలువ మార్గంలో...ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్-ఎల్-మాండెబ్ జలసంధి వద్ద ఈ స్థావరం నెలకొల్పినట్లు తెలుస్తోంది. అంతేగాక డ్రాగన్ ఇప్పుడు అక్కడ యుజావో యుద్ధనౌకను మోహరించినట్టు స్పష్టమవుతోంది.
జిబౌటీ దేశంలో ఈ స్థావరం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. బ్రేక్వాటర్కు ఇరువైపులా నౌకలను మోహరించే ఛాన్స్ ఉండటంతో.. చైనా హెలికాప్టర్ వాహక నౌక అవలీలగా వెళ్లగలదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చైనా మోహరించిన 25 వేల టన్నుల బరువుగల యుద్ధనౌక ... 800 మంది సైనికులు, భారీ ట్యాంకులు, యుద్ధ విమానాలు మోసుకెళ్లే సామార్ధ్యం కల్గిఉంది. జిబౌటీలో మిలిటరీ స్థావరం ఏర్పాటు వ్యూహాత్మకమని భారత్ అంచనా వేస్తోంది. అటు పర్షియన్ గల్ఫ్లోని అమెరికా నౌకాదళ స్థావరాలతో పాటు హిందూమహాసముద్రంలో రెండో అతిపెద్ద నౌకాశక్తి అయిన భారత్ను కూడా చైనా టార్గెట్ చేసినట్లు వెల్లడవుతోంది.
డ్రాగన్ జిబౌటీకి పెద్దఎత్తున అప్పులిచ్చింది. జిబౌటీ అప్పులు చెల్లించలేక అక్కడ మిలిటరీ స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అటు శ్రీలంకలోనూ ఇదే ఫార్మూలాను అమలు చేసింది. హంబన్టోట పోర్టు అభివృద్ధికి చైనా 1.7 బిలియన్ డాలర్ల రుణమిచ్చిన డ్రాగన్... శ్రీలంక చేతులెత్తేయడంతో ఆ పోర్టును 99 ఏళ్లపాటు లీజుగా తీసుకుంది. తాజాగా శాటిలైట్-మిసైల్ ట్రాకింగ్ నౌక యువాన్ వాంగ్ మోహరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com