Kurnool: ఇటలీలో విషాదం.. పైచదువుల కోసం వెళ్లిన ఆంధ్ర యువకుడు మృతి..

Kurnool: ఇటలీలో విషాదం.. పైచదువుల కోసం వెళ్లిన ఆంధ్ర యువకుడు మృతి..
Kurnool: అనుకున్నట్టుగానే ఇటలీలో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు దిలీప్. ఉద్యోగం రాగానే ఓసారి ఇంటికి వస్తానని సమాచారం అందించాడు.

Kurnool: చాలామంది యువతీయువకులు ఉన్నత చదువులు చదవాలన్న కోరికతో విదేశాలకు వెళుతుంటారు. అందులో చాలామంది తాము కన్న కలలను నిజం చేసుకొనే తిరిగి వస్తారు. అలాంటి కలలతోనే ఇటలీకి వెళ్లాడు కర్నూలు జిల్లాకు చెందిన దిలీప్. అనుకున్నట్టుగానే తాను ఇష్టపడిన కోర్సు పూర్తిచేశాడు. త్వరలోనే ఉద్యోగంలో చేరవచ్చు అనుకునేలోపు తీవ్ర విషాదం వారి కుటుంబాన్ని చీకటి చేసింది.

కర్నూలు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల కుమారుడు దిలీప్ అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తిచేశాడు. అగ్రికల్చర్‌లోనే ఎమ్మెస్సీ చేయాలనుకొని ఇటలీలోని మిలాన్‌ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీ ప్రయాణమయ్యాడు. తిరిగి గతేడాది ఏప్రిల్‌లో వచ్చి మళ్లీ సెప్టెంబర్‌లో తిరిగి వెళ్లిపోయాడు.

అనుకున్నట్టుగానే ఇటలీలో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు దిలీప్. ఉద్యోగం రాగానే ఓసారి ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. శుక్రవారం అక్కడే ఉన్న మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు దిలీప్. అక్కడ సముద్రం ఒడ్డున నిలబడి ఉండగా అలలు వచ్చి దిలీప్‌ను తీసుకెళ్లిపోయాయి. దిలీప్‌ను కాపాడాలని కోస్ట్ గార్డులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి తన మృతదేహమే వారికి దొరికింది. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story