New Jersey: న్యూజెర్సీ శాస్త్రవేత్తల అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..
New Jersey: న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని అధ్యయనం ప్రకారం తెలుస్తోంది.
అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే వాతావరణంలోకి చేరే ధూళి రేణువులు కారణంగా కరవు తలెత్తి కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధనలో తెలుస్తోంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం.
అంతేకాదు భారత్-పాక్ మధ్య గనుక చిన్నపాటి యుద్ధం జరిగినా.. ఆ పరిణామం ప్రపంచ ఆహారోత్పత్తి మీద పెను ప్రభావం చూపుతుందని ఆ బృందం వెల్లడించింది. ఐదేళ్లలో ఇరు దేశాల్లో ఏడు శాతం పంట దిగుబడి తగ్గిపోతుందని.. అదే అమెరికా-రష్యాల మధ్య జరిగే యుద్ధం జరిగితే గనుక.. మూడు నుంచి నాలుగేళ్లలో 90 శాతం ఉత్పత్తి పడిపోతుందని తెలిపింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలోనే.. ఈ బృందం ఈ తరహా అధ్యయనానికి చేపట్టింది. పైగా అణు యుద్ధం తలెత్తవచ్చంటూ గతంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన కామెంట్లను సైతం పరిశీలనలోకి తీసుకుంది. యుద్ధం జరిగే సమయంలో ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా.. నష్టాన్ని ఏమాత్రం తగ్గించలేరని..దీనికి శాంతి ఒకటే మార్గమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com