Top IT Companies : ఫ్రెషర్లకు షాకిస్తున్న ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలు..

Top IT Companies : హమ్మయ్య.. అన్ని రౌండ్లు సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేశారు. జాయినవ్వడమే ఆలస్యం అని ఆనంద పడుతున్న ఐటీ అభ్యర్థులకు నిరాశే ఎదురవుతోంది. దిగ్గజ కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా ఫ్రెషర్లకు మొండి చేయి చూపిస్తున్నాయి.
ఈ టెక్ కంపెనీలు అనుభవం లేని అభ్యర్థులను నియమించుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఈ కంపెనీలు ఫ్రెషర్లకు ముందుగా ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. కానీ తరువాత నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వందల మంది ఫ్రెషర్స్కు ఈ కంపెనీలు తొలుత ఆఫర్ లెటర్లు ఇచ్చాయి.
ఆ తరువాత వీరి జాయినింగ్ ప్రాసెస్ను కొంత కాలం వాయిదా వేశాయి. తీరా జాయినింగ్ డేట్ దగ్గరకు వచ్చే సమయానికి ఆఫర్ లెటర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంబంధిత కంపెనీలు ఆఫర్ లెటర్ను రిజెక్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయని బిజినెస్లైన్ నివేదించింది.
నియామక ప్రక్రియలో భాగంగా.. అభ్యర్థులు చాలా రౌండ్లు ఇంటర్వ్యూ పూర్తి చేసిన తరువాత ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది. మీ అర్హతలు మా కంపెనీకి సరితూగేలా లేవు.. అందువల్ల ఆఫర్ చెల్లదు అని ఫ్రెషర్స్కు పలు కంపెనీలు మెయిల్ చేసినట్లు బిజినెస్లైన్ వివరించింది. అయితే ఈ విషయంపై సంబంధిత టెక్ కంపెనీలు స్పందించలేదు.
అయితే ఇటీవల ప్రముఖ టీసీఎస్ కంపెనీ ఉద్యోగుల పని తీరు ఆధారంగా వేతనం ఉండేలా చర్యలు తీసుకుంది. ఇన్ఫోసిస్ 70 శాతానికి నియామకాలను తగ్గించగా, విప్రో నియామక ప్రక్రియను పూర్తిగా వాయిదా వేసింది. మరోవైపు విప్రో మూన్ లైటింగ్ పేరిట దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించింది.
ఏది ఏమైనా ఐటీ సెక్టార్లో నియామకాలు తగ్గిన మాట వాస్తవం. ఆగస్టులో 10 శాతం మేర హైరింగ్ యాక్టివిటీ తగ్గినట్లు తెలుస్తోంది. ఆర్ధికమందగమనం కారణంగా చాలా కంపెనీలు నియామకాలను స్థంభింపజేశాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా కొత్త నియామకాలను నిలిపివేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com