హామీల అమలుకు సిద్దూ సిద్ధం.. ఏడాదికి 50వేల కోట్ల భారం

కర్నాటకలో ఇటీవలే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో..... ఐదు హామీలపై కూలంకషంగా చర్చించారు సీఎం సిద్దరామయ్య. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐదు హామీలను అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, మహిళలకు 2వేల రూపాయల ఆర్థిక భృతి పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంతకం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 5 ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 50వేల కోట్లకుపైగా భారం పడనుంది.
జులై 1 నుంచి గృహ జ్యోతి పథకం అమలు అవుతుంది. జులై వరకు కరెంట్ బిల్లులు ప్రజలు చెల్లించాల్సిందేనన్నారు సీఎం సిద్దరామయ్య. ఇక అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామన్నారు. శక్తి పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని చెప్పారు. ఈ నెల 11 నుంచి మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. విద్యార్థినిలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఉచిత హామీలను కుల, మత బేధాలు లేకుండా అమలు చేస్తామన్నారు సీఎం సిద్ధరామయ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com