KCR Delhi Tour: ధాన్యం కొనుగోలు, నీటి వాటాలు, రాష్ట్ర విభజన హామీల డిమాండ్లు తీరేదెన్నడు..?

KCR Delhi Tour (tv5news.in)
KCR Delhi Tour: కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామంటున్న కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. వరిధాన్యం కొనుగోలు, నీటి వాటాలు, రాష్ట్ర విభజన హామీలు సహా పలు డిమాండ్లతో ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. ఇప్పటికే వారి అపాయింట్మెంట్లు కూడా కోరారు. రెండ్రోజుల పర్యటనలో అవసరమైతే ప్రధాని మోదీని కూడా కలవాలని KCR భావిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, MPలు, ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ ఫ్లైటెక్కుతున్నారు.
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడానికి ఇంకెన్నాళ్లు కావాలంటూ KCR మండిపడ్డారు. విద్యుత్ చట్టాల పేరుతో వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. వెంటనే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, వర్గీకరణను కేంద్రం వెంటనే తేల్చాలన్న కేసీఆర్.. బీసీ కుల గణన చేపట్టాలని కూడా కేంద్రానికి సూచించారు.
అటు, మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్ని స్వాగతించారు. దీనిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్.. కేంద్రం కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com