కర్ణాటకలో ఎన్నికల వేడి.. జోరుగా పార్టీల ప్రచార హోరు

కర్ణాటకలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. బహిరంగ సభలతో ప్రచార హోరు పెంచుతున్నారు.
కర్ణాటకలోని విజయపురలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ రోడ్డు షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రాహుల్, రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షోను ప్రారంభించారు. శివాజీ సర్కిల్, కనకదాస సర్కిల్ నుండి డప్పుల చప్పుడుతో వివిధ ప్రాంతాల్లో రోడ్డు షోను నిర్వహించారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనను కుడాల సంగమం నుండి ప్రారంభించారు. అక్కడ ఆయన 12వ శతాబ్దపు కవి మరియు సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికార బంగ్లా ఖాళీ చేయించారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వందలాది మంది తమ ఇంటికి రావాలని, తమ ఇళ్లు తీసుకోవాలని తనకు లేఖలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనకు ఇళ్లు అవసరం లేదని, దేశమే తన ఇల్లు అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com