రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ

ది కేరళ స్టోరీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు నాలుగు రోజుల ముందు మే 5న విడుదల కాబోతున్న చిత్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కేరళ అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కుట్ర పూరితంగానే సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని.. సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. హిజాబ్, లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ది కేరళ స్టోరీ కథను కేరళ సీఎం పినరాయి విజయన్ ఖండించడంతో ఈ చిత్రం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
కేరళలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సంఘ్ పరివార్ శక్తులు ఇలాంటి దుష్ప్రచారం చేసే చిత్రాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన విషపు విత్తనాలతో కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా మున్ముందు మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో పాగా వేసే లక్ష్యంతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ తన ఓటు బ్యాంక్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ది కేరళ స్టోరీ’ సినిమా టీజర్, అందులోని డైలాగ్లు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను నిషేధించాలని అందిన ఫిర్యాదులపై సీఎం విజయన్ స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు విజయన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com