PM Modi : విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ బిజీ

విదేశాల పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీగా ఉన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా పపువా న్యూ గినియా చేరుకున్నారు మోదీ. అక్కడి విమానాశ్రయంలో దిగిన మోదీకి.. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఎం మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మరాపే.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
జపాన్లో మూడురోజుల పాటు జరిగిన జీ-7 సదస్సులో మోదీ పాల్గొన్నారు. అక్కడ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఆయన.. కీలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడ నుంచి పపువా న్యూ గినియా దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయం చేరుకొని మోదీతో కరచాలనం, సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ దేశాన్ని ఇదివరకు ఏ భారత ప్రధానమంత్రి కూడా ఇప్పటివరకు సందర్శించలేదు.
పపువా న్యూ గినియాలో ఇవాళ జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడో శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇక ఈ సదస్సులో పాల్గొనేందుకు 12 పసిఫిక్ ఐలాండ్ దేశాలు అంగీకరించడం గొప్ప విషయమని మోదీ అన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com