MP: దుర్గా నిమజ్జనం వేళ మధ్యప్రదేశ్ లో విషాదం... 11 మంది మృతి

మధ్యప్రదేశ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జన వేడుకల సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. పండుగ పూట జరిగిన ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే, ఖండ్వా జిల్లాలోని పంధానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జమ్లి గ్రామంలో అత్యంత దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. అర్డ్లా, జమ్లి గ్రామాలకు చెందిన సుమారు 25 మంది భక్తులు దుర్గామాత విగ్రహంతో ట్రాక్టర్-ట్రాలీలో నిమజ్జనం కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ ఇరుకైన కల్వర్టును దాటుతుండగా, అధిక బరువు కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీయగా, వారిలో 8 మంది చిన్నారులే ఉండటం అందరినీ కలచివేసింది.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెరువులో మునిగిపోయిన ట్రాలీని బయటకు తీసేందుకు పొక్లెయిన్ను ఉపయోగించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదే తరహాలో ఉజ్జయిని జిల్లాలోనూ మరో విషాదం జరిగింది. బద్నగర్లోని నర్సింఘా గ్రామం వద్ద నిమజ్జనం కోసం విగ్రహంతో వెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీ చంబల్ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉండగా, ఐదుగురిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వరుస ప్రమాదాలు మతపరమైన ఊరేగింపుల సమయంలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com