ISI: పాక్ కు గూఢచర్యం చేస్తూ దొరికిన 15 ఏళ్ల బాలుడు

ISI:  పాక్ కు  గూఢచర్యం చేస్తూ దొరికిన 15 ఏళ్ల బాలుడు
X
పంజాబ్‌లోని మరికొందరు మైనర్లు కూడా ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు పోలీసుల అనుమానం

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఐఎస్ఐ) తన వ్యూహాలను మార్చుకుంటోంది. భారత్ నుంచి రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ఇప్పుడు చిన్నారులను పావులుగా వాడుకుంటోంది. తాజాగా పంజాబ్ పోలీసులు గూఢచర్యానికి పాల్పడుతున్న 15 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన ఈ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. తన మొబైల్ ఫోన్ ద్వారా భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలకమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేస్తున్నాడని పఠాన్‌కోట్ పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిఘా పెట్టిన పోలీసులు, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాలుడు ఒక్కడే కాకుండా పంజాబ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మరికొంతమంది మైనర్లు కూడా ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చిన్నారులను ప్రలోభపెట్టి వారిని దేశద్రోహ పనులకు పురికొల్పుతున్నట్లు సమాచారం.

పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ దల్జీందర్ సింగ్ ధిల్లాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అరెస్టయిన బాలుడు 15 ఏళ్ల వాడని, డేటా ఎలా బదిలీ అవుతుందనే దానిపై కీలక ఆధారాలు దొరికాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ యూనిట్లను అప్రమత్తం చేశామని, సరిహద్దు ప్రాంతాల్లోని చిన్నారుల ఆన్‌లైన్ యాక్టివిటీపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ కుట్ర మూలాలను ఛేదించేందుకు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags

Next Story