Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి..ముగ్గురు మృతి

ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు. అయితే, శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి దగ్గరకు చేరుకున్నాయి. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు గుండిచా టెంపుల్ వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే రెండు ట్రక్కులు రద్దీగా ఉన్న ఏరియాలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
అయితే, గాయపడిన వారిని పూరీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, పూరీ జగన్నాథ రథయాత్రకు శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. భారీగా జన సమూహం, అలసట వల్ల దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురైన వారిని అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే, చాలామందిని ప్రథమ చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 12 మంది భక్తులు కటక్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com