Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..
X
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం గత కొన్ని రోజులుగా తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. గత వారం జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

దంతెవాడ – బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

కాగా, ఈనెల 20వ తేదీన తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైన విషయం తెలిసిందే. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్‌ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్‌ జిల్లా పీడియా అడవుల్లో గురువారం ఉదయం నక్సల్స్‌, పోలీస్‌ వర్గాల మధ్య సుమారు నాలుగు గంటలపాటు భీకర పోరు సాగింది. ఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌-నారాయణ్‌పూర్‌ జిల్లాల సరిహద్దు కోరోస్‌కోడో గ్రామ సమీప అడవుల్లో జరిగిన మరో ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు.

Tags

Next Story