Gurugram: ఒకే ఆస్తిని 25 మందికి పైగా అమ్మి కోట్లు కొల్లగొట్టిన కంపెనీ డైరెక్టర్ అరెస్ట్
గురుగ్రామ్లో సంచలనం సృష్టించిన భారీ రియల్ ఎస్టేట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఒకే ఆస్తిని పలువురికి అమ్మి వందల కోట్లు కొల్లగొట్టిన కేసులో ఓ కంపెనీ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు. ఈ మోసం ద్వారా నిందితుడు దాదాపు రూ. 500 కోట్ల వరకు మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడు ధ్రువ్దత్ శర్మను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ జనవరి 2న ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2021లో గురుగ్రామ్లోని సెక్టార్-15లో ఉన్న 32 మైల్స్టోన్ భవనంలో మొదటి అంతస్తులోని యూనిట్ 24 (3,000 చదరపు అడుగులు) కోసం ఆప్రా మోటెల్స్ (ప్రస్తుతం 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీకి రూ. 2.5 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, డబ్బు చెల్లించినా ఆస్తిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ (కన్వేయన్స్ డీడ్) చేయలేదని తెలిపారు. ఎన్నిసార్లు సంప్రదించినా, నోటీసులు పంపినా కంపెనీ స్పందించలేదని ఫిర్యాదులో వివరించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం-II (EOW-II) అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందిత కంపెనీ అదే యూనిట్ను 2022-2023 మధ్య కాలంలో మరో 25 మందికి విక్రయించినట్లు గుర్తించారు. సాంకేతిక సమాచారం, ఇతర డేటాను విశ్లేషించి నిందితుడు ధ్రువ్దత్ శర్మ (34) కదలికలను గుర్తించారు. గురుగ్రామ్లోని సివిల్ లైన్స్ నివాసి అయిన శర్మను ఈ నెల 6న గోల్ఫ్ కోర్స్ రోడ్లో అరెస్ట్ చేశారు.
విచారణలో శర్మ నేరాన్ని అంగీకరించాడు. ఒకే యూనిట్ను వేర్వేరు భాగాలుగా విభజించి చాలా మందికి అమ్మినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తన మరో సంస్థ గ్రోత్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అదే ఆస్తిని లీజుకు ఇచ్చినట్లు కూడా వెల్లడించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి కోరతామని అధికారులు తెలిపారు. కస్టడీలో మోసపోయిన డబ్బును రికవర్ చేయడం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడం, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించడంపై దృష్టి పెడతామని పోలీసులు వివరించారు. ఈ భారీ మోసంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


