Uttarakhand: ఉత్తరాఖండ్ క్లౌడ్బరస్ట్.. నలుగురి మృతి, 50 మందికిపైగా గల్లంతు..

ఉత్తరాఖండ్లో క్లౌడ్బరస్ట్ వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశి జిల్లా ధరాలి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు క్లౌడ్బరస్ట్ సంభవించింది.
హర్సిల్ వద్ద భారత సైన్య శిబిరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గంగోత్రి ధామానికి రహదారి మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. బురద నీరు ఒక్కసారిగా దిగువకు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా, 50 మందికిపైగా గల్లంతయ్యారు.
కొండలపై నుంచి తెగివచ్చిన వరద నీటి ప్రవాహంతో చెట్లు, ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంఆది. “హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అంతా సర్వనాశనం అయింది. ఇలాంటి విపత్తు నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒక ప్రత్యక్షసాక్షి మీడియాకు చెప్పారు.
హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గడ్ డ్రెయిన్ పొంగిపొర్లడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉత్తరకాశి పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహా అనేక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికి సమీపంలో ఉన్న సైన్యం మొదటిగా స్పందించి దాదాపు 15 మందిని రక్షించింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై స్పందిస్తూ.. “ధరాలి ప్రాంతంలో క్లౌడ్బరస్ట్ వల్ల సంభవించిన విధ్వంసం చాలా బాధాకరం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సహా పలు బృందాలు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాయి” అని ఎక్స్లో పోస్టు చేశారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా సాయంత్రం వరకు కొనసాగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో ఐదు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు, రెండు సరిహద్దు రహదారులతోసహా 168 రోడ్లకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరద తాకిడికి గురైన ప్రదేశాలకు చేరుకోవడం సహాయక సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ధరాలికి అత్యంత సమీపంలో హార్సిల్లో ఉన్న సైనిక శిబిరం నుంచి సైనిక సిబ్బంది హుటాహుటిన ధరాలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సుమన్ తెలిపారు. రోడ్డు తెగిపోవడం, ప్రతికూల వాతావరణం కారణంగా ఇతర ప్రాంతాల నుంచి సహాయక బృందాలు రావడానికి ఆలస్యం కానున్నట్లు ఆయన చెప్పారు. ఆకస్మిక వరదలకు 40, 50 భవనాలు దెబ్బతిన్నట్లు ఉత్తరాఖండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కే సుధాంశు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “ధరాలి ఘటనలో బాధితుల పట్ల సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి ధామితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం” అని మోదీ ట్వీట్ చేశారు.
.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com