Chhattisgarh: బావిలో విషవాయువు.. ఐదుగురు మృతి

ఛత్తీస్గఢ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావి లో విషవాయువు పీల్చి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంపా జిల్లా కికిర్దా గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
బిలాస్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్ర జైశ్వాల్ అనే వ్యక్తి బావిలో పడిపోయిన చెక్క ముక్క కోసం అందులోకి దిగాడు. అయితే, అతను ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సాయం కోసం స్థానికులను ఆశ్రయించారు. దీంతో జైశ్వాల్ను రక్షించేందుకు రమేశ్ పటేల్, రాజేంద్ర పటేల్, జితేంద్ర పటేల్ ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు బావిలోకి దిగారు. కానీ ముగ్గురూ కూడా తిరిగి రాలేదు.
ఆ తర్వాత టికేశ్వర్ చంద్ర అనే వ్యక్తి కూడా అందులోకి వెళ్లాడు. అతడు కూడా బయటకు రాలేదు. దీంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. బావిలోని విషవాయువు పీల్చి వారంతా చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు బావిలోంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీసేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ప్రయత్నిస్తోందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ శుక్లా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com