EC: అభిజిత్ గంగోపాధ్యాయపై ఈసీ కొరడా

ఇటీవల ఎన్నికల బహిరంగ సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. 24 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. అలాగే, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇతరుల వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేసే ప్రకటనలు చేయవద్దని ఇలాంటివి చేయడం మానుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ) సూచించింది. గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలను ‘తక్కువ స్థాయి వ్యక్తిగత దాడి’గా పేర్కొన్న ఈసీ.. ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత మొత్తానికి అమ్ముడవుతోంది.. ఆమె రేటు రూ.10 లక్షలా..? అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించాలని, అలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఆయనతో పాటు బీజేపీ నాయకులను ఆదేశించాలని డిమాండ్ చేసింది. దీంతో అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ శుక్రవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మే 20 లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయన్ను కోరగా, తాజాగా 24 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com