Ahmedabad Plane Crash: చివరి మృతదేహం వరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి.. మృతులు ఎంతమంది అంటే ..

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరణాల సంఖ్యపై ఓ క్లారిటీ వచ్చేసింది. తొలుత ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. కానీ.. ఆ సంఖ్య ఇప్పుడు 260కి చేరుకుంది. తాజాగా మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజు ఆఖరి డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. ఆ ఆఖరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం.. సంఖ్యను 260గా తేల్చారు.
కాగా.. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి, మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 279 మంది మృతి చెందారు. 2025 జూన్ 12న మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన విమానంలో సమస్య తలెత్తడంతో పైలట్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించే ‘మేడే కాల్’ ఇచ్చారు. పైలట్లతో మాట్లాడేందుకు ATC విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. ఇంతలోనే విమానం అకస్మాత్తుగా కిందికి దిగిపోతూ సమీపంలోని బీజే వైద్య కళాశాల భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.
పైలట్ విమానాన్ని తిరిగి రన్వే పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే లోగా.. అది కుప్పకూలిపోయినట్లు భావిస్తున్నారు. అంతా నిమిషం వ్యవధి లోపే ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫ్లైట్ రాడార్ ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానం ప్రమాదానికి గురవ్వడమే కాకుండా, అది మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com