POLLS: ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

POLLS: ఐదో విడత పోలింగ్‌కు సర్వం  సిద్ధం
కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు.... అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 695మంది అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల ఐదోవిడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వి‌స్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. ఐదోవిడతలో 6రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 695మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఐదో విడతలో మహారాష్ట్రలో 13 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. బిహార్‌ 5, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో చెరొకటి, ఝార్ఖండ్‌3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్‌ 14, పశ్చిమ బెంగాల్‌లో 7పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.


ఐదోవిడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆపార్టీకి కంచుకోటగా భావించే రాయ్‌బరేలిలో పోటీచేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తంపార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్...పోటీకి దిగారు. వయనాడ్‌ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్‌...అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు.

బీజేపీ సీనియర్‌ నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌...లఖ్‌నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహ్‌రోత్రా రాజ్‌నాథ్‌తో తలపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠిని 2019 ఎన్నికల్లో బద్ధలుకొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ...రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్‌ శర్మ...ఈసారి కాంగ్రెస్‌ తరఫున అమేఠీలో పోటీ చేస్తున్నారు. BSP నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌లో ఈసారి WFI మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో WFI మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ విజయం సాధించినప్పటికీ...లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో బీజేపీ ఆయన్ను పక్కనపెట్టింది. SP

తరఫున రామ్‌భగత్, BSP నుంచి నరేంద్రపాండే బరిలో ఉన్నారు. ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య...సరన్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ-LJP అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్...హాజిపుర్ నుంచి బరిలోకి దిగారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ LJP అభ్యర్థులే విజయభేరీ మోగించారు. RJDనుంచి చంద్రరామ్‌... చిరాగ్‌తో పోటీపడుతున్నారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఇప్పటివరకు 379లోక్‌సభ స్థానాల్లో పూర్తయింది. ఐదోవిడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఆరో విడత ఈనెల 25న, ఏడో విడత పోలింగ్‌ జూన్ ఒకటిన జరగనుండగా...జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Next Story