Anant Ambani Birthday : పుట్టినరోజు వేళ గుజరాత్లోని సాలాంగ్పూర్ ఆలయానికి అనంత్ అంబానీ భారీ విరాళం

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గుజరాత్లోని సాలాంగ్పూర్లో ఉన్న ప్రసిద్ధ కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయంలో గోశాల నిర్మాణం కోసం ఆయన రూ. 10 కోట్ల భారీ విరాళం అందించారు. తన 31వ పుట్టినరోజుకు (ఏప్రిల్ 10) ఒక రోజు ముందు గురువారం నాడు ఆయన ఈ విరాళాన్ని అందజేశారు.
ఆలయ ప్రాంగణంలోనే 28 ఎకరాల విశాలమైన క్యాంపస్లో ఈ గోశాలను నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 500 ఆవులకు ఆశ్రయం కల్పించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రముఖ డెయిరీ, వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ సంస్థ 'డీలవాల్' సహకారంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుండగా, దీనికి అంబానీ కుటుంబం ప్రధాన పోషకులుగా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా సాలాంగ్పూర్ ఆలయానికి చెందిన వివేక్సాగర్దాస్ స్వామి, అనంత్ అంబానీకి తన ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా మారుతి యాగం కూడా నిర్వహించారు.
జంతు సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి అనంత్ అంబానీ తరచుగా ప్రాధాన్యమిస్తున్నారు. మంగళవారం నాడు కేరళలోని ఆలయాల మౌలిక వసతులు, జంతు సంరక్షణ కోసం ఆయన రూ. 18 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
