Anant Radhika Pre Wedding Guests : జామ్​నగర్​కు మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్, ఇవాంక ట్రంప్‌

Anant Radhika Pre Wedding Guests : జామ్​నగర్​కు మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్, ఇవాంక ట్రంప్‌
తరలి వస్తున్న అతిరధ మహారధులు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకల కోసం పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు జామ్‌నగర్‌కు క్యూ కడుతున్నారు. హాలీవుడ్‌ గాయకులు, బాలీవుడ్‌ తారలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల రాకతో జామ్‌నగర్‌ విమానాశ్రయం సందడిగా మారింది. మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ కూడా అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యారు.

అంబానీ ఇంట ముందస్తు పెళ్లి సందడి నెలకొంది. జులైలో అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి పీటలు ఎక్కనుండగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ జంట దేశ, విదేశీ ప్రముఖులకు ప్రీవెడ్డింగ్ పేరుతో విందును ఇస్తోంది. ఇందు కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను నూతన జంట ఎంచుకుంది. దీంతో జామ్‌నగర్‌ విమానాశ్రయం ప్రముఖుల రాకతో కళకళలాడుతోంది. రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్‌, ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యారు. క్రికెటర్లు సచిత్‌ తెందూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని, సూర్యకుమార్ యాదవ్‌, జహీర్‌ ఖాన్‌ కుటంబ సమేతంగా హాజరయ్యారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తన భర్త కశ్యప్‌తో కలిసి జామ్‌నగర్‌కు చేరుకున్నారు. సంగీత దర్శకుడు, గాయకుడు అను మాలిక్‌ కుటుంబంతో కలిసి విచ్ఛేశారు. బ్రిటన్‌ ఇంధన దిగ్గజం బ్రిటిష్‌ పెట్రోలియం సీఈవో ముర్రే, మాజీ సీఈవో బాబ్‌ డుడ్లే... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ PMS ప్రసాద్‌తో కలిసి జామ్‌నగర్‌కు చేరుకున్నారు.


బాలీవుడ్‌ ప్రముఖులు అనిల్‌ కపూర్‌ తన కుమార్తె సోనమ్‌ కపూర్‌తో కలిసి జామ్‌నగర్‌ చేరుకున్నారు. వరుణ్‌ ధావన్‌ కుటుంబ సభ్యులతో కలిసి అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తన సతీమణి కరీనా కపూర్‌, కుమార్తె సారా అలీ ఖాన్‌తో కలిసి విచ్ఛేశారు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమీర్‌ ఖాన్‌, సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. సిద్ధార్థ్ మల్హోత్ర తన సతీమణి కియారా అడ్వాణీతో విచ్ఛేశారు. అక్షయ్‌ కుమార్‌, శ్రద్ధా కపూర్‌ కూడా జామ్‌నగర్‌కు చేరుకున్నారు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తన సతీమణి జెనీలియాతో కలిసి ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ కూడా జామ్‌నగర్‌కు చేరుకున్నారు

Tags

Read MoreRead Less
Next Story