ముంబైలో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్ కుక్

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ముంబైలో ప్రారంభించిన తొలి అధికారిక స్టోర్ ఆకట్టుకుంటుంది. ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను మంగళవారం ప్రారంభించిన యాపిల్ సీఈవో టిమ్ కుక్..కస్టమర్లకు సాదర స్వాగతం పలికారు. అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన భారత్లో స్టోర్ను ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిస్తోందని, దీర్ఘకాలంగా భారత్తో ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని టిమ్ కుక్ అన్నారు.
ఐఫోన్ తయారీ సంస్థ అయిన యాపిల్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్టోర్ను ఏర్పాటు చేసింది. రెండో స్టోర్ను ఈ నెల 20న ఢిల్లీలో యాపిల్ ప్రారంభించనుంది. ముంబైలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను పలు ప్రత్యేకతలతో తీర్చిదిద్దారు. 100 మంది సిబ్బంది ఈ స్టోర్లో విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో సగం మంది మహిళా ఉద్యోగులే. 18 భారతీయ భాషల్లో వీరు మాట్లాడుతారట.. ఈ స్టోర్లో యాపిల్కు సంబంధించిన అన్ని ఉత్పత్తులతో పాటు రిపేరింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 20న ఢిల్లీలో స్టోర్ను ప్రారంభించనున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను టిమ్ కుక్ మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ సందర్భంగా పెట్టుబడులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com