ARATTAI: స్వదేశీ యాప్ అరట్టైకు సుప్రీంకోర్టు ప్రశంస

వాట్సప్ (WhatsApp)కు పోటీగా దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై (Arattai)' పేరు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ ప్రస్తావనకు వచ్చింది. వాట్సప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ రిట్ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. "వాట్సప్ లేకపోతే ఏం... కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు ఉన్నాయి కదా! ఈ మధ్యే స్వదేశీ యాప్ ‘అరట్టై’ కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి. " అని ధర్మాసనం సూచించింది.
'ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది?' అని ప్రశ్న:
తన ఖాతాను వాట్సప్ అకారణంగా బ్లాక్ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక మాధ్యమాలు ఇలా ఖాతాలను ఉన్నట్టుండి నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తంచేసింది. ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్ ఎందుకు వేశారని, వాట్సప్ యాక్సెస్ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది? అని ప్రశ్నించింది.
'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహిస్తూ..
పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిస్తూ.. "పిటిషనర్ ఓ పాలీ డయాగ్నిక్ సెంటర్లో పనిచేస్తున్నారు. గత 10-12 ఏళ్లుగా వాట్సప్లోనే తన క్లయింట్లతో టచ్లో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్ చేశారు" అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇతర ప్రత్యామ్నాయ యాప్లను ఉపయోగించవచ్చని, ముఖ్యంగా దేశీయ యాప్ అయిన 'అరట్టై'ని వాడుకోవాలని సూచించింది. ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కాదని వ్యాఖ్యానించింది. దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను తిరస్కరించింది. అనంతరం, కోర్టు అనుమతితో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
అరట్టై ప్రత్యేకతలు, ప్రజాదరణ:
సుప్రీంకోర్టు ప్రస్తావించిన అరట్టై యాప్ను దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసింది. తమిళంలో 'అరట్టై' అంటే 'పిచ్చాపాటీ సంభాషణ' అని అర్థం. ఈ యాప్ ఇప్పటికే కోటి మందికి పైగా వినియోగదారులను కలిగి ఉంది, విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. క్లీన్ ఇంటర్ఫేస్, పలు ఫీచర్లు, గోప్యత మీద దృష్టి పెట్టడం వంటి వాటితో ఇది మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది. ఈ యాప్ ద్వారా మెసేజ్లు, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీటింగుల్లో పాల్గొనటానికి, స్టోరీలు, ఫొటోలు, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడానికి వీలుంది. పాకెట్స్ అనేది అరట్టై ప్రత్యేకత. మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. త్వరలో చాట్స్కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వెల్లడించారు. స్వదేశీ యాప్ను ప్రోత్సహించాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సాంకేతిక రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తిని పెంచే విధంగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com