Jayalalitha AIIMS Report : జయలలిత చనిపోవడానికి అసలు కారణం అదేనా..?
Jayalalitha AIIMS Report : తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది ఎయిమ్స్ వైద్యబృందం. ఈ మేరకు ఆర్మగస్వామి కమిషన్కు ఆదివారం నివేదిక సమర్పించింది. జయలలిత 2016లో అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఐతే జయలలిత మరణంపై పన్నీర్ సెల్వం అనుమానాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్న పళనిస్వామి రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. జయలలిత మరణంపై పలువురిని విచారించిన ఎయిమ్స్ వైద్యుల బృందం...కమిషన్కు మూడు పేజీల నివేదిక సమర్పించింది.
అపోలో ఆస్పత్రిలో చేరకముందే జయలలితకు థైరాయిడ్, బీపీ, షుగర్ మొదలైన పలు అనారోగ్య సమస్యలున్నాయని, ఆస్పత్రిలో చికిత్స టైంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తినడంతో సెప్టెంబరు 28న ఆరోగ్యం క్షీణించి ఊపిరితిత్తుల సమస్య తలెత్తినట్లు నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అక్టోబరు 7న ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించారని, అక్టోబరు 14 నుంచి లండన్ వైద్యుడు రిచర్డ్ బిలే, అపోలో ప్రత్యేక వైద్యులు, ఎయిమ్స్ వైద్యులు ట్రీట్మెంట్ అందించారని తెలిపింది.
డిసెంబరు 3వ తేదీన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, 4వ తేదీ శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని, ఎక్మో ఏర్పాటుచేసి 24 గంటలు పర్యవేక్షించారని స్పష్టం చేసింది. డిసెంబర్ 5న మెదడు, గుండె పనిచేయలేదని వైద్యులు నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొంది. ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com