Shubhanshu Shukla: స్వదేశానికి శుభాన్షు శుక్లా.. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ ఘనంగా స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్ విజయవంతం తర్వాత శుభాన్షు శుక్లా భారత్ రావడం ఇదే మొదటిసారి. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న నేషనల్ స్పేస్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు.
యాక్సియం-4 మిషన్లో భాగంగా శుక్లా బృందం ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్కు శుక్లా చీఫ్ పైలట్గా వ్యవహరించారు. ఐఎస్ఎస్లో 18 రోజుల పాటూ గడిపిన ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. శుభాన్షు బృందం జులై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు కూడా ఇతనే కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com