Kashmir Pandit Killings : కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..
Kashmir Pandit Killings : కాశ్మీర్లో మళ్లీ హింస చెలరేగుతోంది. కాశ్మీరీ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. జన సమూహంలోకి వచ్చి, పండిట్లు ఎవరో తెలుసుకుని మరీ హత్య చేస్తున్నారు. నిన్న కాశ్మీర్ లోయలోని చోటిపొరాలో ఒక యాపిల్ తోటలోకి వచ్చిన అల్-బదర్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు.. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎవరు కాశ్మీరీ పండిట్లో తెలుసుకుని, వారిని పక్కకు తీసుకెళ్లి, ఏకే-47తో కాల్పులు జరిపారు.
కాల్పులను ఉగ్రవాదులు వీడియో కూడా తీశారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిన్న ఉగ్రమూక చేతిలో చనిపోయిన సునీల్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో శ్మశానవాటికికు ర్యాలీగా వెళ్లారు. హిందూ, ముస్లిం, సిక్కుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
గడిచిన ఏడాదిలో ఇలా 21 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కాశ్మీర్ లోయలో వారం రోజులుగా మిలిటెంట్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. మొన్న ఆదివారం ఒక పోలీసు చంపేశారు. గత వారంలో బీహార్కు చెందిన ఒక వలస కూలీని ఉగ్రవాదులు హత్య చేశారు. బుడ్గాం, శ్రీనగర్ జిల్లాలో సోమవారం నాడు రెండు గ్రెనేడ్ దాడులు జరిగాయి. మొత్తంగా 15మంది సాధారణ పౌరులతో పాటు ఆరుగురు భద్రత సిబ్బంది ఉగ్రవాదుల దాడుల్లో కన్నుమూశారు.
కాశ్మీరీ పండిట్ల సామాజిక వర్గానికి చెందిన వారంతా కశ్మీర్ లోయను విడిచి వెళ్లిపోవాలని కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి సూచించింది. పండిట్లు తక్షణమే జమ్మూ, ఢిల్లీకి వెళ్లిపోవాలని తెలిపింది. 32 ఏళ్లుగా కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇంకెంత మంది చనిపోవాలంటూ పండిట్ సంఘర్ష్ సమితి ఆవేదన వ్యక్తం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com