Maharashtra: మాజీ భర్తే బంధించాడు, పోలీసులకు వివరించిన అమెరికా మహిళ

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ(50)ను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మహిళను ఆమె భర్తే బంధించి ఉంటాడనే అనుమానంతో విచారణ చేపట్టారు. ప్రస్తుతం గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన మాజీ భర్తే తనను అడవిలోకి తీసుకువెళ్లి, ఇనుప గొలుసులతో చెట్టుకు బంధించాడని.. 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని కాగితంపై రాసి చూపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ రాసిన నోట్ ఆధారంగా ఆమె మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ మహిళ బాగా నీరసంగా ఉండడంతో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు. పరిస్థితి మెరుగయ్యాక వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేస్తామన్నారు.
గత వారం సింధుదర్గ్ అటవీ ప్రాంతంలో ఇనుప గొలుసులతో కట్టి పడేసి ఉన్న ఓ మహిళ చేసిన ఆర్తనాదాలను పశువుల కాపరి విన్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు అతడు తెలియజేశాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులతోపాటు గ్రామస్తులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో భారీ వృక్షాలకు ఇనుప గొలుసులతో బంధించి.. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను ఈ సందర్భంగా వారు గుర్తించారు.
40 రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోక పోవడంతో.. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో తొలుత ఆమెను సింధుదుర్గ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె ఆరోగ్యం మానసికంగా కూడా బలహీన పడడంతో.. బింబోలిలోని గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతుంది. ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతుంది. దీంతో పోలీసులకు ఆమె పలు కీలక విషయాలను వివరించింది.
తన భర్త సతీశ్తో కలిసి తమిళనాడులో దశాబ్దం పాటు నివసిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సందర్భంగా తనతో భర్త వ్యవహరించిన తీరును సైతం ఈ సందర్బంగా పోలీసులకు కాగితంపై రాసి వివరించింది. ఇక గత 40 రోజులుగా తాను నీరు, ఆహారం లేకుండా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నానని చెప్పింది. ఈ ఆటవీ ప్రాంతంలో నీరు, ఆహారం లేకుండా ఉంటే.. తాను మరణిస్తానని భర్త సతీశ్ భావించారని.. దీంతో తను వదిలి వెళ్లారని పోలీసులకు ఆమె వివరించింది.
మరోవైపు ఆటవీ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన బ్యాగ్ను పోలీసులు గమనించారు. అందులో యూఎస్ పాస్ పోర్ట్ జిరాక్స్తోపాటు తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును సైతం వారు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కోంకణ్ రేంజ్ ఐజీ సంజయ్ దారాడే మాట్లాడుతూ.. బాధితురాలు లలిత్ కేయి కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. అలాగే ప్రాథమిక సమాచారాన్ని సైతం అందించారని చెప్పారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఐజీ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com