Axiom-4 Mission: స్పేస్ఎక్స్ ఆక్సియమ్ మిషన్ వాయిదా..

స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 11న నిర్వహించనున్నారు. ఇది ఆక్సియమ్ మిషన్-4లో భాగంగా చేపడుతున్న ప్రత్యేక మిషన్ కావడం విశేషం.
దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత, జూన్ 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ మిషన్ సిబ్బంది ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్కు చేరుకుంటారని భావించారు. ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో ముగ్గురు సిబ్బందితో కలిసి ఆక్సియం-4 అనే అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. ఆక్సియం-4 మిషన్ నలుగురు సభ్యుల సిబ్బందితో 60 ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఏడు ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసింది, మరో ఐదు ప్రయోగాలలో శుభాన్షు శుక్లా నాసా మానవ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పాల్గొనే ప్రయోగాలు ఉన్నాయి. అదనంగా, శుక్లా అదే కార్యక్రమం కోసం నాసా నిర్వహించే ఐదు సహకార అధ్యయనాలలో కూడా పాల్గొంటారు. ఈ మిషన్ 14 రోజులు ఉంటుంది. ఆక్సియం-4 సిబ్బందిలో భారతదేశం, పోలాండ్, హంగేరీ నుంచి వ్యోమగాములు ఉన్నారు. ఈ సిబ్బందిలో పెగ్గీ విట్సన్, శుభాన్షు శుక్లా, స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, టిబోర్ కాపు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com