Death Note web series: ‘వెళ్లాల్సిన’ టైమొచ్చింది!.. కర్ణాటకలో లేఖ రాసి బాలుడి ఆత్మహత్య

బెంగళూరులోని CK అచ్చుకట్టు ప్రాంతంలో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటనకు ప్రసిద్ధ జపాన్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ ప్రభావం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆత్మహత్య సంబంధించి దర్యాప్తులో.. ఆ అబ్బాయి ‘డెత్ నోట్’ సిరీస్ను తరచుగా చూసేవాడని.. అలాగే తన గదిలో ఆ సిరీస్లోని ఒక పాత్ర చిత్రాన్ని గీసి ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాలు అతనిపై సిరీస్ ప్రభావం ఉండవచ్చన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇక బాలుడి తల్లిదండ్రుల ప్రకారం.. అతనికి పాఠశాలలో గానీ, ఇంట్లో గానీ ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో, పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బాలుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
మృతి చెందిన బాలుడు మ్యూజిషియన్ గణేష్, సింగర్ సవిత దంపతుల కొడుకు గంగాధర్(14). వెబ్ సిరీస్ అదేపనిగా చూస్తూ అందులో లీనమై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమయంలో గంగాధర్ గదిలోకి వెళ్లి గిటార్ స్ట్రింగ్తో ఉరివేసుకున్నాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకునే ముందు ఓ డెత్ నోట్ రాశాడు. అందులో ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది, మీరు లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటానని గంగాధర్ లేఖలో రాసుకొచ్చాడు. ఈ ఘటనతో తల్లితండ్రులు ఒక్కసారిగా కుమిలిపోయారు.
ఇకపోతే ‘డెత్ నోట్’ కథలో.. ఒక హై స్కూల్ విద్యార్థి ఒక రహస్య నోట్బుక్ను కనుగొంటాడు. ఆ నోట్బుక్లో ఎవరి పేరు రాస్తే వారు మరణిస్తారు. ఈ శక్తిని ఉపయోగించి, తాను అనైతికంగా భావించే వ్యక్తులను చంపి, నేరరహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటాడు. దీనిని అడ్డుకునేందుకు జపాన్ పోలీస్ టాస్క్ఫోర్స్ ప్రయత్నిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com