MALARIA: మలేరియా టీకా ధర తగ్గింపు దిశగా భారత్ బయోటెక్

మలేరియా వ్యాధి నియంత్రణలో విశేషంగా ఉపయోగపడే ‘ఆర్టీఎస్,ఎస్’ టీకా ధరను క్రమంగా తగ్గించేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, బ్రిటన్కు చెందిన జీఎస్కే పీఎల్సీ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చితే 2028 నాటికి ఈ టీకా ధర 5 డాలర్ల కంటే తక్కువగా లభించనుంది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మలేరియా వ్యాధిపై పోరాటానికి మరింత బలం చేకూరనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ అయిన ‘ఆర్టీఎస్,ఎస్’ను జీఎస్కే సంస్థ పాథ్, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ను జీఎస్కే భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, వ్యయాలను తగ్గించడం, లాభాలను కుదింపుతో టీకా ధర తగ్గింపును సాధించనున్నారు. ఈ ఏడాది చివరినాటికి మలేరియా ముప్పు అధికంగా ఉన్న 12 ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని భావిస్తున్నారు. గావి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహకారంతో ఈ వ్యాక్సిన్ను అత్యవసర ప్రదేశాలకు అందించనున్నారు. భారత్ బయోటెక్ ఈ ఉత్పత్తి సదుపాయాల విస్తరణ కోసం ఇప్పటికే 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,700 కోట్లు) పెట్టుబడిని పెట్టింది.
మలేరియా వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనాలన్న లక్ష్యంతో 2021లోనే భారత్ బయోటెక్తో ఒప్పందం కుదుర్చుకున్నామని జీఎస్కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ తెలిపారు. టీకా సాంకేతికత బదిలీ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపు తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. 2030 నాటికి మలేరియా వ్యాధి నివారణ ద్వారా ఆఫ్రికాలో 5 కోట్ల మంది చిన్నారులను కాపాడాలనే లక్ష్యాన్ని గావి సంస్థ నిర్దేశించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com