బిహార్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం.. నితీష్ ఎత్తుగడ ఫలిస్తుందా?
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫైట్ తుది అంకానికి చేరింది. శనివారం మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది. 78అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు గాను అధికారులు సర్వం సిద్దంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 12వందల మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 2 కోట్ల 35లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్తో పాటు మరో 12మంది మంత్రులు కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. మూడోదశలో 19 జిల్లాల పరిధిలో ఉన్న 78స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గంగానదికి ఉత్తర భాగంలోనే ఉన్న కోసీ-సీమాంచల్ ప్రాంతంలోనివే. అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్కు కూడా పట్టు ఉంది. చివరి దశ ప్రచారంలో భాగంగా ఎన్డీయే తరుపున ప్రధాని నరేంద్రమోదీ 12 ప్రచార సభల్లో పాల్గొనగా.. మహాకూటమి తరుపున రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేశారు. 'ఇవే నా చివరి ఎన్నికలు' అంటూ నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. నితీశ్ కుమార్ ప్రచార వ్యూహాలతో ఇక్కడ ఓటర్ల గాలి మళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
ఈనెల 10న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మూడోదశ పోలింగ్ అనంతరం ఎగ్జిట్పోల్స్ వెలువడనున్నాయి. ఈసారి బిహార్ ప్రజలు ఎవరికి పట్టం కానున్నారో.. సర్వే ఫలితాలను విడుదల చేయనున్నారు. దీంతో బిహార్తో పాటు..దేశవ్యాప్తంగా సర్వే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మరి నువ్వానేనా అన్నట్టు సాగిన బిహార్ ఎన్నికల సమరంలో ప్రజలు ఎవరికి.. సీఎం పీఠాన్ని కట్టబెట్టతారో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com