Manipur: మణిపూర్లో నో వర్క్.. నో పే

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి బీరేన్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు దాడి చేస్తారోననే భయంతో చాలామంది ఉద్యోగులు ఇంటికే పరిమితం అవ్వగా... గైర్హాజరవుతున్న ఉద్యోగులకు జీతంలో కోతలు తప్పవని, రాష్ట్రంలో నో వర్క్ నో పే రూల్ అమలు చేస్తామని బీరేన్సింగ్ ప్రభుత్వం వెల్లడించింది. మణిపూర్లో దాదాపు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. అందులో చాలామంది గైర్హాజరు అవుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లర్లను నియంత్రించే పని పోలీసులు, భద్రతా బలగాలు చూసుకుంటాయని, ఉద్యోగులు మాత్రం యథావిధిగా తమ విధులకు హాజరుకావాలని బీరేన్సింగ్ తెలిపారు.
అల్లర్లు మొదలైనప్పటి నుంచి విధులకు హాజరు కాని వారి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని అన్ని శాఖల అధిపతులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీరేన్సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలనా విభాగం, మణిపూర్ సెక్రటేరియట్ నుంచి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులందరికీ నో వర్క్ నో పే నిబంధన వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అనుమతి లేకుండా అధికారిక విధులకు హాజరుకాని ఉద్యోగులందరికీ వేతనం ఇచ్చేది లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com