Delhi New CM : ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా

Delhi New CM : ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
X
ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. షాలిమార్‌బాగ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తా(50)ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం బుధవారం ఎంపిక చేసింది. దీంతో బీజేఎల్పీ నాయకురాలిగా ఆమెను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం రాజ్‌నివాస్‌లో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.

సీఎం పదవికి ప్రధానంగా పోటీపడ్డ పర్వేశ్‌ వర్మ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తున్నది. గురువారం రామ్‌లీలా మైదానంలో సీఎంగా రేఖా గుప్తా, మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావడంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కాగా, కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ వర్మ, ఆశిష్‌ సూద్‌, విజేందర్‌ గుప్తా వంటి వారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ మహిళగా రేఖా గుప్తాకు బీజేపీ అవకాశం కల్పించింది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రుల్లో మహిళలు ఎవరూ లేకపోవడం కూడా ఆమెకు కలిసొచ్చింది.

ఎవరీ రేఖా గుప్తా?

ఢిల్లీకి కాబోతున్న నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఇంతకుముందు సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌, ఆతిశీ మహిళా సీఎంలుగా పని చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి బందన కుమారిపై 29 వేల ఓట్ల భారీ మెజారిటీతో షాలిమార్‌బాగ్‌ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆమెకు ఇదే మొదటిసారి. విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలో ఆమె చురుగ్గా పని చేశారు.

1996లో ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1974లో హర్యానాలోని జింద్‌ జిల్లా నంద్‌గఢ్‌ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి ఎస్బీఐ అధికారిగా ఢిల్లీకి బదిలీ కావడంతో రేఖా గుప్తా కుటుంబం ఇక్కడ స్థిరపడింది.

Tags

Next Story