Madhya Pradesh Election Result : ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
![Madhya Pradesh Election Result : ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. Madhya Pradesh Election Result : ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..](https://www.tv5news.in/h-upload/2023/12/03/1129351-bjpwinvjpg-816x480-4g.webp)
మధ్యప్రదేశ్లో కౌంటింగ్ ఆరంభం నుంచే భారతీయ జనతా పార్టీ జోరు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగా కౌంటింగ్ సరళి కనిపిస్తోంది. భారీ ఆధిక్యంతో కమలం పార్టీ దూసుకుపోతోంది. ఈసారి అధికారం తమదేనన్న కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 230స్థానాలున్న మధ్యప్రదేశ్లో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఎనిమిదిన్నర నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల కోసం...692 టేబుళ్లను, ఈవీఎంల కోసం 4వేల 3వందల 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఝుబువా నియోజకవర్గంలో అత్యధికంగా 26రౌండ్లలో, సేవదా స్థానంలో 12రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు చూపించాయి. రెండో సారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ అన్నారు.
మధ్యప్రదేశ్లోని 230స్థానాలకు గతనెల 17న పోలింగ్ జరగ్గా 77.82శాతం ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 75.63శాతం ఓటింగ్ నమోదైంది. 116 సీట్లు గెలిచిన పార్టీ....మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 116స్థానాలు, భాజపా 109 సీట్లు గెలుపొందాయి. కమల్ నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు ఏడాదిన్నర తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరగుబాటు చేయటంతో ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్సింగ్ సారథ్యంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com