Brij Bhushan: మహిళా రెజ్లర్లను వేధించడం నిజమే ..

Brij Bhushan: మహిళా రెజ్లర్లను వేధించడం నిజమే ..
ఎఫ్‌ఐఆర్‌లలోని కీలకాంశాలు వెలుగులోకి..

భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలోని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కోసం తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్ వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. మహిళా రెజ్లర్లతో బ్రిజ్‌భూషణ్‌ నీచమైన చర్యలకు తెగబడేవాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను బట్టి తెలుస్తోందన్నారు.

ఈ కేసులో నిన్నరోజ్ అవెన్యూ కోర్టులో జరిగిన వాదనలకు భూషణ్ సింగ్‌ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కోర్టు అందుకు మినహాయింపునిచ్చింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారు. తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు.

ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీర్పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు. తజికిస్థాన్‌లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు పోలీసులు కోర్టుకి వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌కి తాను చేసేది తప్పు అని తెలిసినా పదేపదే అదే తప్పు చేశారని స్పష్టం చేశారు. అలాగే భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాది వాదనకు అతుల్ కౌంటర్ ఇచ్చారు. నేరాలన్నీ దేశం బయట జరకగలేదని, దేశంలో కూడా జరిగాయి కాబట్టి ఎలాంటి అనుముతలు అవసరం లేదని స్పష్టం చేశారు.


మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్‌ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు.

కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది.




Tags

Read MoreRead Less
Next Story