Supreme Court: సిసోడియాను జైల్లో ఉంచలేం.

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీశ్ సిసోడియాను నిరవధికంగా జైలులో ఉంచలేమంటూ పేర్కొంది.
సిసోడియాపై మోపిన నేరాభియోగాలపై వాదనలు ఎప్పుడు ప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థల తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ధర్మాసనం అడిగింది. ‘మీరు ఆయన్ను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరు. ఒకసారి చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత వాటిపై వాదనలు వెంటనే ప్రారంభం కావాలి’ అని కోర్టు తెలిపింది. సిసోడియాపై నమోదైన కేసు సీఆర్పీసీ సెక్షన్ 207(నిందితుడికి దస్ర్తాల సరఫరా) స్థాయిలో ఉందని.. దాని తర్వాత వాదనలు ప్రారంభిస్తామని రాజు తెలిపారు. మంగళవారంలోగా వాదనలు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని జస్టిస్ ఖన్నా రాజును కోరారు. సెక్షన్ 17ఎ ప్రకారం సిసోడియా విచారణ లేక దర్యాప్తునకు ముందస్తు అనుమతి తీసుకొన్నారా అని కోర్టు రాజును ప్రశ్నించింది. మంగళవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది.
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు చేశారని, మనీలాండరింగ్కు పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ సిసోడియాను మార్చి 9న అరెస్టు చేశాయి. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న ఆయన బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది. ఛార్జిషీటు సమర్పించిన తరువాత కూడా ట్రయల్ కోర్టులో ఎందుకు వాదనలను ప్రారంభించడం లేదని ప్రశ్నించింది. అరెస్టు చేసే ముందు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ‘ఔను’ అని సమాఽధానం ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి, 18 శాఖలు నిర్వహించిన వ్యక్తి లంచం తీసుకున్నారంటే అది తీవ్రమైన విషయమని, బెయిల్ ఇవ్వకూడదని కోరారు. ఆప్ ఢిల్లీ శాఖను కూడా ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పార్టీగా చేర్చనున్నాయని చెప్పారు. దీనిపైఽ ధర్మాసనం స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రత్యేకంగా ఛార్జిషీటు దాఖలు చేస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com